చంద్రప్రభవాహనంపైవెన్నముద్దకృష్ణుడిఅలంకారంలోసిరులతల్లి
తిరుపతి, 2025 నవంబరు 23: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం రాత్రి అమ్మవారు వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదహారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే తనను సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్స్వామి, టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ ఎం. శాంతా రామ్, సివిఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
